తెలుగు సినిమా బలం వాళ్లే: అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

తెలుగు చిత్ర పరిశ్రమకు ఉన్న అసలైన బలం కార్పొరేట్ సంస్థలు కాదని, సినిమాపై ప్రేమతో ఆస్తులు అమ్మి, ఇళ్లు తాకట్టు పెట్టి సినిమాలు తీసే నిర్మాతలేనని ప్రముఖ నటుడు అడివి శేష్ అన్నారు. తన తాజా చిత్రం 'డెకాయిట్' ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన ఐఏఎన్ఎస్‌తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు సినిమాకు ఉన్న ప్రత్యేకత ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

"తెలుగులో ఇప్పటికీ స్టూడియోలు కాకుండా తపన కలిగిన వ్యక్తులే సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకరు ఇల్లు తాకట్టు పెట్టి వస్తారు, మరొకరు భూమి అమ్మి వస్తారు. రియల్ ఎస్టేట్‌లో సంపాదించిన వారు, డాక్టర్లు.. ఇలా ఎంతో మంది తమ అభిరుచితో రూ.300, 400 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాలను కూడా నిర్మిస్తున్నారు. స్టూడియోలు కాకుండా వ్యక్తులు నిర్మించడం వల్లే సినిమాలపై వారికి బలమైన ఎమోషనల్ ఓనర్‌షిప్ ఉంటుంది" అని అడివి శేష్ వివరించారు.

హిందీయేతర చిత్ర పరిశ్రమలు ఎప్పటినుంచో అద్భుతమైన సినిమాలు తీస్తున్నాయని, అయితే కోవిడ్ మహమ్మారి తర్వాత వాటి ఆదరణ దేశవ్యాప్తంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. "కోవిడ్ సమయంలో ప్రజలు తమ భాషా చిత్రాలు చూడటం పూర్తయ్యాక, ఇతర భాషల సినిమాలను సబ్‌టైటిల్స్‌తో లేదా డబ్బింగ్‌లో చూడటం ప్రారంభించారు. ఈ ఒక్క మార్పు అన్ని భాషలకు సమాన అవకాశాలు కల్పించి, ప్రాంతీయ సినిమా ప్రాచుర్యాన్ని పెంచింది" అని అడివి శేష్ తెలిపారు. బెంగాలీ, మలయాళం, తమిళం, తెలుగు ఇలా అన్ని పరిశ్రమలు ఇప్పుడు సమానమైన ఆదరణ పొందుతున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


More Telugu News