క్లాస్ రూంలో ప్రపోజ్ చేసిన ప్రొఫెసర్... చెప్పుతో కొట్టిన మెడికల్ విద్యార్థిని

బెంగళూరు శివార్లలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తరగతి గదిలో లెక్చర్ చెబుతూనే ఓ విద్యార్థినికి ప్రేమ ప్రతిపాదన చేసిన ప్రొఫెసర్‌పై తోటి విద్యార్థులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నెల్లమంగళ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మెడికల్ కాలేజీలో ఈ సంఘటన జరిగింది. క్లాస్ జరుగుతుండగా, ప్రొఫెసర్ ఓ విద్యార్థినికి చాక్లెట్ అందించి, అందరి ముందే తన ప్రేమను వ్యక్తం చేశారు. "ఈ బ్యాచ్‌లోని చాలా ముఖ్యమైన అమ్మాయికి, మీ అందరికీ చాక్లెట్లు ఇస్తున్నాను... ఐ లవ్ యూ" అని చెప్పినట్లు వీడియోలో రికార్డయింది.

దీంతో ఆ విద్యార్థిని వెంటనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రొఫెసర్ ప్రవర్తనను ప్రశ్నిస్తూ, తన చెప్పుతో కొట్టింది. ఇతర విద్యార్థులు కూడా ప్రొఫెసర్‌పై క్యాంపస్‌లో దాడి చేశారు. అతనిని కారు వరకు తరిమి చితకబాదారు. వారి నుంచి తప్పించుకున్న ప్రొఫెసర్, అక్కడి నుంచి పరారయ్యాడు.

అంతకుముందు క్లాస్‌లో విద్యార్థిని ఎదురుతిరగడంతో, ఆమె కూడా తనకు ప్రపోజ్ చేసిందని, దానికి సీసీటీవీ ఫుటేజీలో ఆధారం ఉందని ప్రొఫెసర్ చెప్పాడు. ఆ ఫుటేజీని వెంటనే చూపించాలని విద్యార్థిని సవాలు చేయడంతో ప్రొఫెసర్ మాట దాటవేశాడు. 

ఈ ఘటనలో ప్రొఫెసర్, విద్యార్థిని వేర్వేరు వర్గాలకు చెందినవారు కావడంతో అధికారులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. పరారీలో ఉన్న ప్రొఫెసర్‌ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 


More Telugu News