తిరుమల ఘాట్ రోడ్డులో 'న్యూటన్' బస్సును పరీక్షిస్తున్న అధికారులు
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలను కాలుష్య రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం మేరకు తిరుమల-తిరుపతి మధ్య డీజిల్ బస్సుల స్థానంలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను (EV) ప్రవేశపెట్టే ప్రక్రియ వేగవంతమైంది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విడతల వారీగా జిల్లాకు 350 ఈవీ బస్సులను ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తొలి విడతలో 50 బస్సులను మంగళం డిపోకు కేటాయించారు.
ప్రస్తుతం తిరుమల ఘాట్ రోడ్లపై వివిధ ఆటోమొబైల్ సంస్థల ఈవీ బస్సుల టెస్ట్ రైడ్స్ జరుగుతున్నాయి. తాజాగా 'న్యూటన్' సంస్థకు చెందిన బస్సు పనితీరును ఆర్టీసీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి-కాణిపాకం మధ్య పరీక్షలు ముగించుకున్న ఈ బస్సు, గత రెండు రోజులుగా తిరుమల ఘాట్ రోడ్లలోని మలుపుల్లో లోడ్, స్పీడ్ మరియు రేంజ్ పరంగా మెరుగైన ఫలితాలను ఇస్తోంది. ఫ్రంట్, మిడిల్ డోర్ సదుపాయం ఉన్న ఈ బస్సుపై అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు. త్వరలోనే శ్రీవారి భక్తులకు కాలుష్య రహిత, ఆహ్లాదకరమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది.