మార్కాపురం బస్సు ప్రమాద స్థలిని పరిశీలించిన హోంమంత్రి అనిత

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, జిల్లా అధికారులతో కలిసి ఆమె ప్రమాద స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 'గోల్డెన్ అవర్'లో స్పందించి పలువురి ప్రాణాలు కాపాడిన అధికారుల చొరవను అభినందించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న 28 మంది క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అవసరమైన వారిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించాలని సూచించామన్నారు.

బాధితుల వైద్య ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి అనిత స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై నిపుణుల కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తామని, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా భద్రతా ప్రమాణాలను మరింత కఠినతరం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.


More Telugu News