Arvind Kejriwal: ‘ధురంధర్’ పాత్రతో పోలుస్తూ కేజ్రీవాల్ పై బీజేపీ నేత తీవ్ర వ్యాఖ్యలు

Arvind Kejriwal Compared to Dakait Rahman by BJP Leader
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'రెహమాన్ డకైత్'లా ప్రజల సొమ్మును దోచుకున్నారంటూ బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారిక నివాసం (శీష్ మహల్) పునరుద్ధరణ పనుల కోసం భారీగా ఖర్చు చేశారని ఆరోపించింది. తనను తాను ఓ మహారాజులా భావించుకుంటూ కేజ్రీవాల్ ‘శీష్ మహల్’ను విలాసవంతంగా తీర్చిదిద్దుకున్నారని మండిపడింది.

ఈ మేరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. ఆప్ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం ‘శీష్ మహల్’ కోసం కొనుగోలు చేసిన వస్తువులకు సంబంధించి బిల్లులను సభలో చదివి వినిపించారు. ఈ వ్యాఖ్యలతో సభలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), అధికార పార్టీ బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

శీష్ మహల్ వివాదంపై జరిగిన చర్చలో పర్వేశ్ వర్మ మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన ధురంధర్ సినిమాలోని విలన్ రెహమాన్ డకైత్ ప్రజలను ఎలా దోచుకుంటాడో, కేజ్రీవాల్ కూడా తన విలాసవంతమైన భవనం కోసం ప్రజాధనాన్ని అలానే దోచుకున్నారని ఎద్దేవా చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఆక్సిజన్, ఆసుపత్రి బెడ్ల కోసం ఇబ్బందులు పడుతుంటే కేజ్రీవాల్ మాత్రం కోట్ల రూపాయలతో తన ఇంటిని ఆధునికీకరించుకున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా, శీష్ మహల్ కోసం చేసిన ఖర్చుల వివరాలతో ఉన్న ఓ భారీ రసీదుల రోల్‌ను ఆయన సభలో ప్రదర్శించారు. రూ.36 లక్షల సోఫాలు, రూ.1.05 కోట్ల విలువైన టేబుళ్లు కొన్నారంటూ వివరాలు చదివి వినిపిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా పంజాబ్‌లో కూడా కేజ్రీవాల్ మరో ‘శీష్ మహల్’ నిర్మిస్తున్నారని, ఆయనో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

సీఎం నివాస నిర్మాణంలో నిబంధనలు ఉల్లంఘించారని, అంచనా వ్యయం కన్నా 342% అధికంగా ఖర్చు చేశారని కాగ్ నివేదికపై ఈ చర్చ జరగడం గమనార్హం. మరోవైపు, బీజేపీ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీ కొత్త నివాసం కోసం వేల కోట్లు ఖర్చు చేశారని, దానిపై చర్చ జరపకుండా సీఎం నివాసం గురించి మాట్లాడటం సరికాదని ఆప్ నేతలు ఎదురుదాడి చేశారు. రూ.6.2 కోట్లతో వీవీఐపీ బోటు కొంటున్న బీజేపీ నేతలు విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని వారు పేర్కొన్నారు. మొత్తంమీద, కేజ్రీవాల్‌ను నేరుగా ‘డకైత్’ అని సంబోధిస్తూ బీజేపీ తన దాడిని తీవ్రతరం చేసింది. సినిమా పాత్రలతో పోలుస్తూ చేస్తున్న ఈ విమర్శలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
Go Back to Shorts
Arvind Kejriwal
Delhi
Sheesh Mahal
Parvesh Verma
BJP
Aam Aadmi Party
corruption allegations
Delhi CM residence renovation
politics
Rahman Dakait

More Telugu News