యాప్‌లకు బానిసగా మార్చారు.. మెటా, యూట్యూబ్‌లకు జరిమానా!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థలు మెటా (ఇన్‌స్టాగ్రామ్ మాతృసంస్థ), యూట్యూబ్‌లకు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారులను వ్యసనపరులుగా మార్చేలా ఉన్నాయని, ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లపై వాటి ప్రభావం గురించి హెచ్చరించడంలో విఫలమయ్యాయని లాస్ ఏంజిల్స్ కోర్టు జ్యూరీ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితురాలైన యువతికి 6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.50 కోట్లు) నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

కేసు నేపథ్యం ఏమిటి?
కాలే జి.ఎమ్. అనే 20 ఏళ్ల యువతి ఈ కేసు దాఖలు చేసింది. చిన్నతనం నుంచే ఈ ప్లాట్‌ఫామ్‌ల వాడకం మొదలుపెట్టి, సంవత్సరాల తరబడి వాటికి బానిసగా మారానని ఆమె తన వాంగ్మూలంలో పేర్కొంది. దీనివల్ల తాను తీవ్రమైన ఆందోళన, డిప్రెషన్, బాడీ డిస్మార్ఫియా వంటి మానసిక సమస్యలతో బాధపడ్డానని తెలిపింది. ఆరేళ్ల వయసులో యూట్యూబ్ వీడియోలు చూడటం, తొమ్మిదేళ్లకే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరవడం చేశానని చెప్పింది. "ఎప్పుడూ వాటిపైనే ఉండాలనిపించేది. వాటిని చూడకపోతే ఏదో కోల్పోతున్నాననే భావన కలిగేది" అని ఆమె కోర్టుకు వివరించింది.

యువతి తరఫు న్యాయవాది మార్క్ లానియర్ వాదిస్తూ, ఈ కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే పిల్లలను ఆకట్టుకునేలా తమ ప్లాట్‌ఫామ్‌లను రూపొందించాయని ఆరోపించారు. "వారికి తెలుసు! వాళ్లు పిల్లలనే లక్ష్యంగా చేసుకున్నారు" అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్ష విధించాలని కోరారు.

కంపెనీల వాదన ఇదే..
అయితే, ఈ ఆరోపణలను మెటా, గూగుల్ యాజమాన్యాలు తోసిపుచ్చాయి. బాధితురాలి మానసిక సమస్యలకు వ్యక్తిగత పరిస్థితులు, స్కూల్‌లో ఎదురైన బెదిరింపులు కూడా కారణమై ఉండవచ్చని వాదించాయి. తమ ప్లాట్‌ఫామ్‌లు వ్యసనం కలిగించేలా రూపొందించలేదని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి తెలిపారు. వినియోగదారుల సమయాన్ని పెంచడం తమ లక్ష్యం కాదని, వారికి ఉపయోగపడే సేవలు అందించడమే తమ ఉద్దేశమని జుకర్‌బర్గ్ చెప్పారు.

ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ‌తామని మెటా, యూట్యూబ్ ప్రకటించాయి. యువత మానసిక ఆరోగ్యం చాలా సంక్లిష్టమైన అంశమని, దానికి ఒకే యాప్‌ను కారణంగా చూపలేమని మెటా ప్రతినిధి తెలిపారు. మరోవైపు యూట్యూబ్ ఒక స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మాత్రమేనని, సోషల్ మీడియా సైట్ కాదని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు.

ప్రస్తుతం కాలిఫోర్నియాలోనే మెటా, యూట్యూబ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్‌లపై ఇలాంటివి 3,000కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజా తీర్పు ఆ కేసులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని, మరిన్ని సెటిల్‌మెంట్లకు దారితీయవచ్చని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.


More Telugu News