అందుకే పెట్రోల్ బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు: తెలంగాణ మంత్రి

ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయని, గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందిలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో ప్రజలు అపోహలను నమ్మవద్దని కోరారు. చమురు కంపెనీలు కూడా సరిపడా నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయని అన్నారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేయడంతో బంకుల్లో రద్దీ నెలకొందని అన్నారు. క్యాన్లు, కంటైనర్లలో ఇంధనాన్ని తీసుకువెళ్లడం చట్టవిరుద్ధమని, అలా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గృహ అవసరాలకు గ్యాస్ కొరత లేదని స్పష్టం చేశారు.

అదే సమయంలో హాస్టళ్లు, ఆసుపత్రులకు గ్యాస్ కొరత లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంలో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా పని చేస్తున్నాయని మంత్రి వెల్లడించారు. ఏ బంకును కూడా మూసివేయడానికి అనుమతించలేదని అన్నారు. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నట్లు మంత్రి తెలిపారు. చట్టవిరుద్ధంగా నింపిన 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి తెలిపారు.


More Telugu News