ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్తె వివాహ వేడుక.. సీఎం రేవంత్ రెడ్డికి సాదర స్వాగతం పలికిన మంత్రి లోకేశ్‌

టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ కుమార్తె వివాహ వేడుక గుంటూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. శ్రీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకలో ఇరు రాష్ట్రాల నేతలు పక్కపక్కనే కూర్చోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

కుటుంబసభ్యులతో కలిసి వివాహానికి హాజరైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి నారా లోకేశ్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి నూతన వధూవరులు నాగసాయి వైదీప్తి, కెవిన్ రామ్‌లను ఆశీర్వదించారు. పుష్పగుచ్ఛం అందించి, వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.

ఈ వివాహ వేడుకకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు టీడీపీకి చెందిన ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.



More Telugu News