భోజనానికి ఆహ్వానించి.. కొడుకు చూస్తుండగానే భార్య, ఆమె ప్రియుడిని కాల్చి చంపాడు!

వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న కోపంతో కట్టుకున్న భార్యను, ప్రాణ స్నేహితుడిని ఓ వ్యక్తి అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌, ఘజియాబాద్‌లోని ట్రోనికా సిటీ రామ్‌పార్క్ కాలనీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. ముందుగా స్నేహితుడిని ఇంటికి భోజనానికి పిలిచి, ఆ తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడటం గమనార్హం.

ఫర్నిచర్ వ్యాపారి అయిన రషీద్ (38), అతడి భార్య షబ్నమ్ (36) దంపతులకు ఏడాదిన్నర నుంచి 20 ఏళ్ల వయసున్న ఏడుగురు పిల్లలు వున్నారు. రషీద్ వద్ద పనిచేసే ఫహీమ్ (32) అతడికి మంచి స్నేహితుడు. అయితే, గత రెండేళ్లుగా షబ్నమ్, ఫహీమ్ మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడి వివాహ సమయంలో ఈ విషయం రషీద్‌కు తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. సంబంధం ఆపేయాలని భార్యను హెచ్చరించినా ఆమెలో మార్పు రాలేదు.

ఈ క్రమంలో సోమవారం రాత్రి ఫహీమ్‌ను రషీద్ తన ఇంటికి భోజనానికి పిలిచాడు. ముగ్గురూ కలిసి భోజనం చేశాక వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అర్ధరాత్రి సమయంలో గదిలోని అల్మారా నుంచి తుపాకీ తీసిన రషీద్.. మొదట ఫహీమ్‌పై, ఆ తర్వాత భార్య షబ్నమ్‌పై కాల్పులు జరిపాడు. తలలకు బుల్లెట్ గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే కుప్పకూలారు. ఈ హత్యలను వారి ఏడేళ్ల కుమారుడు కళ్లారా చూశాడు. హత్యల అనంతరం కుమారుడి వైపు చూసిన రషీద్.. "ఇక అంతా సర్దుకుంటుంది" అని చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు.

శబ్దాలు విని వచ్చిన ఇరుగుపొరుగు వారు బాధితులను ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఫహీమ్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు రషీద్‌పై హత్య కేసు నమోదు చేశారు. నిందితుడితో పాటు హత్యకు గురైన ఫహీమ్‌కు కూడా నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తన పేరు మీద ఉన్న ఇంటిని అమ్మి విడాకులు తీసుకోవాలని షబ్నమ్ భావించడం కూడా ఈ హత్యలకు మరో కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పరారీలో ఉన్న రషీద్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.


More Telugu News