చైనాతో టెక్ వార్.. ఏఐ, చిప్స్‌లో పైచేయి కోసం అమెరికా కొత్త వ్యూహం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ రంగాల్లో చైనాతో వ్యూహాత్మక పోటీని ట్రంప్ యంత్రాంగం మరింత తీవ్రతరం చేసింది. ఇది కేవలం సాంకేతిక పోటీ మాత్రమే కాదని, ప్రపంచ శక్తిగా నిలదొక్కుకోవడం, ఆర్థిక భద్రతను కాపాడుకోవడం కోసం చేస్తున్న "నైతిక పోరాటం" అని అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి చట్టసభ సభ్యులు స్పష్టం చేశారు.

వాషింగ్టన్‌లో జరిగిన 'హిల్ అండ్ వ్యాలీ ఫోరమ్' సమావేశంలో అమెరికా చట్టసభల ప్రతినిధులు కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక సాంకేతిక రంగాల్లో చైనా దూకుడును అడ్డుకునేందుకు బహుముఖ వ్యూహాన్ని అనుసరించనున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా చైనాకు టెక్నాలజీ ఎగుమతులపై కఠిన నియంత్రణలు విధించడం, దేశీయంగా పెట్టుబడులను పెంచడం, మిత్రదేశాలతో సమన్వయం చేసుకోవడం వంటి చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు.

సెనేటర్ జిమ్ బ్యాంక్స్ మాట్లాడుతూ.. ఏఐ రంగంలో పోటీని "రెండో ప్రచ్ఛన్న యుద్ధం"గా అభివర్ణించారు. "మనం చైనాను గెలవనివ్వకూడదు. అదే మా చివరి మాట" అని ఆయన అన్నారు. చైనా వంటి ప్రత్యర్థులకు అధునాతన సెమీకండక్టర్ చిప్స్ ఎగుమతులను నియంత్రించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. అమెరికాలో తయారైన చిప్స్‌కు తొలి ప్రాధాన్యం దేశీయ వినియోగదారులకే ఇవ్వాలని, శత్రువులకు కాదని ఆయన తేల్చిచెప్పారు.

హౌస్ సెలెక్ట్ కమిటీ చైర్మన్ జాన్ మూలెనార్ మాట్లాడుతూ.. చైనాతో పోటీలో "రక్షణ పరమైన దృక్పథం" అవసరమని అన్నారు. కీలకమైన సరఫరా గొలుసుల కోసం అమెరికా ఇప్పటికీ చైనాపై ఆధారపడటాన్ని ఆయన ఒక బలహీనతగా పేర్కొన్నారు. "మన ప్రధాన ప్రత్యర్థిపై మనం ఆధారపడటం ఆపాలి" అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పోటీ ఇప్పుడు బయోటెక్నాలజీ రంగానికి కూడా విస్తరించిందని, ఈ రంగంలో అమెరికా నాయకత్వాన్ని నిలబెట్టుకోవడం చాలా ముఖ్యమని సెనేటర్ టాడ్ యంగ్ పేర్కొన్నారు. 


More Telugu News