హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్

హర్మూజ్ జలసంధిని దాటాలంటే ఏ దేశం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓడరేవులు, నౌకాయనం, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్ కుమార్ సిన్హా తెలిపారు.

పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిన నౌకలు హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లాలంటే ఇరాన్ తో ఒప్పందాలు అవసరమనే ప్రచారం సాగుతోంది. ఏదో ఒక రకమైన ఒప్పందం కుదుర్చుకుంటేనే భారత్ నౌకలకు ఇరాన్ అనుమతిస్తోందనే వాదనలు వినిపించాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఒప్పందం అనుమతులను భారత్ కొట్టిపారవేసింది.

ఎల్పీజీ సహా సరకు రవాణా నౌకలను సురక్షితంగా తీసుకురావడానికి ఇరాన్ నుంచి భారత్ అనుమతి తీసుకున్నదా, ఇందుకోసం డబ్బులు ఏమైనా చెల్లించిందా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. రాజేశ్ కుమార్ సిన్హా స్పందిస్తూ, ఈ జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందం పరిధిలోకి వస్తుందని వెల్లడించారు.

అక్కడ ఏ నౌకలకైనా స్వేచ్ఛా ప్రయాణం ఉంటుందని అన్నారు. అక్కడి నుంచి ప్రయాణంపై నిర్ణయం తీసుకోవాల్సింది షిప్పింగ్ కంపెనీలు, నౌకను అద్దెకు తీసుకున్న కంపెనీలు మాత్రమేనని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా పరిస్థితులను అనుసరించి అందుకు అనుగుణంగా సంస్థలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు.


More Telugu News