Jitendra Singh: టీబీ చికిత్సలో ఆయుర్వేదం... భారత్ కీలక ముందడుగు

TB Treatment India Integrates Ayurveda in Landmark Clinical Study
షార్ట్స్‌లో చూడండి
ప్రపంచ క్షయవ్యాధి (టీబీ) దినోత్సవం సందర్భంగా భారత్ ఒక కీలక ముందడుగు వేసింది. టీబీకి అందించే ప్రామాణిక చికిత్స (ఏటీటీ)కు అదనంగా ఆయుర్వేదాన్ని ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు ప్రపంచంలోనే తొలి క్లినికల్ స్టడీని ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఇవాళ (మార్చి 24) ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా ఈ ప్రకటన వెలువడింది.

బయోటెక్నాలజీ విభాగం, ఆయుష్ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఎనిమిది సంస్థలలో, కొత్తగా క్షయ వ్యాధి నిర్ధారణ అయిన 1,250 మంది రోగులను ఈ పరిశోధన కోసం ఎంపిక చేయనున్నారు. ప్రామాణిక చికిత్సతో పాటు ఆయుర్వేద మందులు ఇవ్వడం వల్ల రోగుల శరీర బరువు, పోషకాహార ఫలితాలు, వ్యాధి తీవ్రత, జీవన నాణ్యత, భద్రత వంటి అంశాలపై ఎలాంటి ప్రభావం ఉంటుందో అంచనా వేయడమే ఈ అధ్యయనం ముఖ్య ఉద్దేశం.

ఈ స్టడీ 'హోల్-ఆఫ్-సైన్స్' (సంపూర్ణ విజ్ఞానం) స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. బయోటెక్నాలజీ, ఆయుర్వేదం వంటి శాస్త్రాలను ఏకం చేయడం, మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేయడం గొప్ప విషయమని తెలిపారు. డెక్సా, ఎంఆర్‌ఐ, ఇమ్యూన్ ప్రొఫైలింగ్, మెటబొలోమిక్స్ వంటి అధునాతన సాధనాలను ఉపయోగించి రోగుల శరీరంలో మార్పులను పరిశీలిస్తామని బీఆర్‌ఐసీ-ఎన్ఐఐ డైరెక్టర్ డాక్టర్ దేబశిస మొహంతి వివరించారు.

ప్రపంచంలోని మొత్తం టీబీ కేసుల్లో దాదాపు 25 శాతం భారత్‌లోనే ఉన్నాయని, అయితే గత దశాబ్దంలో దేశంలో క్షయ వ్యాధి 21 శాతం తగ్గిందని మంత్రి జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. "క్షయ రహిత భారత్ కోసం సమష్టిగా కృషి చేస్తాం" అన్న ప్రధాని మోదీ మాటలను ఆయన ఉటంకించారు. డయాబెటిస్, టీబీ వంటి వ్యాధులకు మధ్య సంబంధం ఉందని, ఒకటి మరొకదాని తీవ్రతను పెంచుతుందని, అందుకే సమీకృత చికిత్సా విధానాలు అవసరమని ఆయన పేర్కొన్నారు.


Go Back to Shorts
Jitendra Singh
Tuberculosis
TB
Ayurveda
India
Ministry of Ayush
TB treatment
clinical study
Bharat TB
TB day

More Telugu News