ఆంబోతుల కొట్లాటలో సామాన్యులే బలి: కేటీఆర్

రాష్ట్రంలో నెలకొన్న గ్యాస్ సిలిండర్ల కొరతను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో గన్‌పార్కు వద్ద కేటీఆర్ నేతృత్వంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో వినూత్నంగా నిరసన తెలిపారు. అంతర్జాతీయ పరిణామాల సాకుతో సామాన్యులకు సిలిండర్లు దొరకకుండా చేస్తున్నారని, గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందని కేటీఆర్ మండిపడ్డారు.


కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని అబద్ధాలు చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలియం శాఖ తమ పరిధిలో లేదని తప్పించుకుంటోందని కేటీఆర్ ధ్వజమెత్తారు. వీరిద్దరి వైఖరి "ఆంబోతుల కొట్లాటలో లేగదూడలు బలైనట్లు" సామాన్య ప్రజల పాలిట శాపంగా మారిందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ బరువును 14 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇది ప్రజల జేబులకు చిల్లు పెట్టడమేనని ఆయన ఆరోపించారు. గ్యాస్ సరఫరాపై నెలకొన్న అయోమయాన్ని తొలగించేలా ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని కొరత తీర్చాలని డిమాండ్ చేశారు.


More Telugu News