అమరావతిపై కుట్రలు సహించం.. హోంమంత్రి అనిత సీరియస్

రాజధాని అమరావతిలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్ని ప్రమాదాలపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు. అమరావతికి వ్యతిరేకంగా ఎవరు కుట్రలు పన్నినా సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు.

అమరావతిలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. సోమవారం అర్ధరాత్రి రాయపూడి సమీపంలోని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల బంగ్లాల వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంపై వివరాలు వెల్లడించారు. ఐదు అగ్నిమాపక వాహ‌నాలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయని వివరించారు. ఇటీవల కలెక్టర్ల సదస్సు జరిగిన రోజున కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందని, ఈ ఘటనలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినవేనని తమకు బలమైన అనుమానాలు ఉన్నాయని అన్నారు. వర్షాలు కురుస్తున్న సమయంలో ఇలాంటి అగ్నిప్రమాదాలు జరగడం అసాధారణమని అభిప్రాయపడ్డారు.

"సోమవారం అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ ఉక్కు పరిశ్రమకు భూమిపూజ కార్యక్రమం విజయవంతమైంది. ఈ పరిణామం ఓర్వలేకనే కొందరు రాజధానిలోని పైపులకు నిప్పు పెట్టారా? అనే సందేహాలు కలుగుతున్నాయి" అని మంత్రి అనిత వ్యాఖ్యానించారు. గతంలో కూడా అమరావతి నిర్మాణాన్ని అడ్డుకునేందుకు అరటితోటకు నిప్పు పెట్టిన ఘటనలు ఉన్నాయని ఆమె గుర్తుచేశారు. ఈ ప్రమాదాలపై పోలీసు శాఖ అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరుపుతుందని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News