విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్

ప్రముఖ సినీ దర్శకుడు ప్రియదర్శన్, ఆయన మాజీ భార్య, ఒకప్పటి నటి లిజీ విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ కలిసి జీవిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. 2016లో చట్టప్రకారం విడిపోయిన ఈ జంట, ప్రస్తుతం ఒకే ఇంట్లో ఉంటున్నట్లు ప్రియదర్శన్ స్వయంగా ధృవీకరించారు. అయితే, మళ్లీ పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం లేదని ఆయన స్పష్టం చేశారు.

1990లో వివాహం చేసుకున్న ప్రియదర్శన్, లిజీ 24 ఏళ్ల వైవాహిక బంధం తర్వాత 2014లో విడిపోయారు. 2016లో వారి విడాకులు అధికారికంగా ఖరారయ్యాయి. అప్పట్లో తమ విడాకులకు 'అహం' కారణమని ప్రియదర్శన్ చెప్పగా, తమ బంధంలో చాలా గొడవలు జరిగాయని, కోర్టు పోరాటం కూడా తీవ్రంగా సాగిందని లిజీ పేర్కొన్నారు.

తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియదర్శన్ మాట్లాడుతూ, "ఒక్క మ్యారేజ్ సర్టిఫికెట్ తప్ప, మేమిద్దరం మునుపటిలాగే కలిసి జీవిస్తున్నాం. వివాహ ధృవీకరణ అనేది కేవలం ఒక కాగితంపై ఉండే విషయం మాత్రమే. స్నేహం, ఒకరికొకరు తోడుగా ఉండటమే ముఖ్యం" అని తెలిపారు. తిరిగి పెళ్లి చేసుకునే ప్రణాళికలు ఏవీ లేవని తేల్చిచెప్పారు.

వారి పిల్లలైన నటి కల్యాణి ప్రియదర్శన్, సిద్ధార్థ్ చొరవతోనే ఈ జంట మళ్లీ ఒకటైనట్లు కుటుంబ సన్నిహితులు చెబుతున్నారు. దాదాపు 6 నుంచి 8 నెలల క్రితమే వీరిద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవలే లిజీకి చెందిన స్టూడియోను సందర్శించిన మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి, వారిద్దరూ కలిసి ఉండడం చూసి సంతోషం వ్యక్తం చేసినట్లు తెలిసింది. 


More Telugu News