Iran War: సౌదీలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు

Iran targets US military facilities in Saudi Arabia
షార్ట్స్‌లో చూడండి
సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) సోమవారం ఉదయం ప్రకటించింది. ఈ పరిణామంతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్, బహ్రెయిన్‌లోని అమెరికా ఫిఫ్త్ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం లక్ష్యంగా ఈ దాడులు జరిపినట్లు ఐఆర్ జీసీ ప్రతినిధి తెలిపారు. అమెరికా నిఘా విమానాలు ఈ స్థావరాల నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నందున వాటిని లక్ష్యంగా చేసుకున్నామని చెప్పారు. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు కేసీ-135 స్ట్రాటోట్యాంకర్ విమానాలు దెబ్బతిన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

మరోవైపు, సౌదీ అరేబియా తమ దేశంపైకి వస్తున్న ఇరాన్ ఆయుధాలను అడ్డుకుంది. రియాద్, తూర్పు ప్రాంతం లక్ష్యంగా వచ్చిన రెండు డ్రోన్లు, ఒక బాలిస్టిక్ క్షిపణిని తమ వాయు రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు సౌదీ రక్షణ శాఖ ప్రకటించింది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ వైమానిక దళం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని మౌలిక సదుపాయాలపై కొత్తగా బాంబు దాడులు మొదలుపెట్టింది. తమ లక్ష్యాలను సాధించే దిశగా యుద్ధం సరైన మార్గంలోనే సాగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వ్యాఖ్యానించారు.

మరోపక్క, ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభం 1970ల నాటి చమురు సంక్షోభం కంటే భయంకరంగా మారవచ్చని అంతర్జాతీయ ఇంధన సంస్థ చీఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధ ప్రభావం భారత్‌పైనా స్పష్టంగా కనిపిస్తోంది. చమురు, ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతుండటంపై భారత పార్లమెంటులో ఆందోళన వ్యక్తమైంది.
Go Back to Shorts
Iran War
USA
Saudi Arabia
Israel
Middle East
West Asia Conflict

More Telugu News