APIIC: ఏపీఐఐసీ అధీనంలోని 51 వేల ఎకరాల మ్యుటేషన్‌కు అనుమతి

APIIC Lands AP Government Permits Mutation of 51000 Acres
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)కి చెందిన భూములను రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ జీవో నెం. 61ని విడుదల చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం, 51,603.46 ఎకరాల భూమిని ఏపీఐఐసీ పేరు మీద రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ చేసేందుకు ప్రభుత్వం అధికారం ఇచ్చింది. వీటిలో 32,723 ఎకరాల ప్రభుత్వ భూములు, 12,099 ఎకరాల డీకేటీ భూములు, 6,780 ఎకరాల పట్టా భూములు ఉన్నాయి. అదే సమయంలో, ఎలాంటి అభ్యంతరాలు లేని సుమారు 70 వేల ఎకరాల ఏపీఐఐసీ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించనున్నారు.

ఏపీఐఐసీ కేటాయించిన భూములు 22ఏ జాబితాలో ఉండటంతో, పరిశ్రమలు ఏర్పాటు చేసే సంస్థలు బ్యాంకు రుణాల కోసం ఆస్తులను తనఖా పెట్టలేకపోతున్నాయి. దీంతో ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయి. ఈ అడ్డంకిని తొలగించి, పెట్టుబడులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రక్రియను అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీఐఐసీ నుంచి అభ్యర్థన రాగానే తహసీల్దార్లు 'వెబ్‌ల్యాండ్' పోర్టల్‌లో మ్యుటేషన్ పూర్తి చేయాలి. అనంతరం జిల్లా రిజిస్ట్రార్లు ఈ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. ఈ మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా ప్రత్యేక డ్రైవ్‌గా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
Go Back to Shorts
APIIC
Andhra Pradesh
Land Mutation
Industrial Development
Government Land
DKT Lands
Pattalands
Section 22A
Revenue Records
Investments

More Telugu News