నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కొంతకాలంగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మక నంది అవార్డులను త్వరలోనే పునఃప్రారంభిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖల మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక ప్రకటన చేశారు. చలనచిత్ర, టీవీ, నాటక రంగాలకు చెందిన కళాకారులకు గౌరవం, గుర్తింపు అందించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

విశాఖపట్నంలో సినిమా నిర్మాణానికి అనువైన లొకేషన్లు ఎన్నో ఉన్నాయని, వాటిని ప్రోత్సహించి నిర్మాణ సంస్థలను ఇక్కడికి ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి దుర్గేశ్ వివరించారు. కూటమి ప్రభుత్వం కళాకారుల అభివృద్ధికి, సినిమా రంగం బలోపేతానికి కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నంది అవార్డుల ప్రదానోత్సవానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉద్ఘాటించారు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... కళాకారులను ప్రోత్సహించడంలో పొరుగు రాష్ట్రమైన ఏపీ కొంత వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా మంత్రి కందుల దుర్గేశ్ నంది అవార్డులపై ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

నంది నాటకోత్సవాలను కూడా తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో తెలుగు సినీ, నాటక రంగాల్లోని కళాకారుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. అవార్డుల ఎంపిక ప్రక్రియ, జ్యూరీ కూర్పు, దరఖాస్తుల ఆహ్వానం వంటి పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడతాయని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.


More Telugu News