తండ్రి గౌరవం కోసం ఒకరు.. ఆస్తుల కోసం మరొకరు!... సోమిరెడ్డి ఆసక్తికర విశ్లేషణ
వైఎస్ కుటుంబంలో ముదిరిన ఆస్తుల తగాదాపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కన్నతల్లి విజయమ్మే స్వయంగా అఫిడవిట్ విడుదల చేసి ఆవేదన వ్యక్తం చేయడం చూస్తుంటే, జగన్ తన స్వార్థం కోసం కుటుంబాన్ని ఎంతలా రోడ్డుపైకి ఈడ్చారో అర్థమవుతుందని ఆయన మండిపడ్డారు.
రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ వేల కోట్లు గడించారని, కానీ ఇప్పుడు అవే ఆస్తుల విషయంలో తల్లికి, చెల్లి షర్మిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లికి వ్యతిరేకంగా తన సొంత మీడియా సంస్థల్లోనే కథనాలు రాయించిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని, ఇది అత్యంత దారుణమని ఆయన విమర్శించారు. ఆస్తుల కోసం కన్నతల్లిని కూడా గౌరవించకుండా ఆమెను కోర్టుల చుట్టూ, మీడియా ముందుకు వచ్చేలా చేయడం వైఎస్సార్ ఆశయాలకే విరుద్ధమని సోమిరెడ్డి పేర్కొన్నారు.
జగన్ తీరుకు భిన్నంగా నారా లోకేశ్ ప్రవర్తన ఉందని సోమిరెడ్డి కొనియాడారు. తండ్రి చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినప్పుడు, లోకేశ్ విశ్రమించకుండా పోరాడి మళ్ళీ ఆయన్ను ముఖ్యమంత్రి సీటులో కూర్చోబెట్టే వరకు శ్రమించారని గుర్తు చేశారు. ఒకవైపు జగన్ తన కుటుంబంలో ఆస్తుల కోసం చిచ్చులు పెడుతుంటే, లోకేశ్ మాత్రం తండ్రి గౌరవం కోసం, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని సోమిరెడ్డి విశ్లేషించారు.