'శంబాల' టీమ్‌తో సందీప్ కిషన్ కొత్త చిత్రం... పాన్ ఇండియా స్థాయిలో మూవీ

యంగ్ హీరో సందీప్ కిషన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. తన కెరీర్‌లో 33వ సినిమాగా రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌కు (#SK33) 'శంబాల' ఫేమ్ యుగంధర్ ముని దర్శకత్వం వహించనున్నారు. సూపర్‌హిట్ చిత్రం 'శంబాల'ను నిర్మించిన షైనింగ్ పిక్చర్స్ సంస్థ ఈ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ విషయాన్ని సందీప్ కిషన్ శనివారం తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.

"సింహాలు, తోడేళ్లు, రాజులు, కత్తులతో మన పురాణాల్లోకి ఒక సాహసోపేత ప్రయాణం" అంటూ సందీప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేపుతోంది. ఒకవైపు గర్జిస్తున్న సింహం, మరోవైపు తోడేలు, వాటి మధ్యలో నేలపై పాతిన కత్తితో ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. "కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొందరు రాజులు ఎప్పటికీ చనిపోరు" అనే ట్యాగ్‌లైన్ సినిమా కథాంశంపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉండగా, సందీప్ కిషన్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వాటిలో 'సిగ్మా' ఒకటి. ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతుండటంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యాక్షన్-అడ్వెంచర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్ సరసన ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. నిధి వేట నేపథ్యంలో సాగే ఈ కథలో కేథరిన్ ట్రెసా ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.


More Telugu News