'రాకాస'తో వస్తున్న కొణిదెల నిహారిక.. మళ్లీ మేకప్ వేసుకోవడానికి రెడీ అని వెల్లడి

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నిహారిక కొణిదెల ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉన్నారు. 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్' బ్యానర్‌పై ఆమె నిర్మించిన 'కమిటీ కుర్రాళ్ళు' భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు తన తదుపరి చిత్రం 'రాకాస'తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు.


సంగీత్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రంపై నిహారిక ధీమాగా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో సందడి చేయనుంది. ఇది ఒక 'హర్రర్ కామెడీ ప్లస్ ఫాంటసీ' జానర్‌లో తెరకెక్కిన సినిమా. కుటుంబ సభ్యులందరూ కలిసి చూసేలా క్లీన్ ఎంటర్‌టైనర్‌గా దీనిని రూపొందించామని నిహారిక తెలిపారు. ఇప్పటికే సంగీత్ శోభన్‌తో 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వంటి హిట్ వెబ్ సిరీస్ నిహారిక నిర్మించారు. ఇప్పుడు అదే కాంబోలో సినిమాతో వస్తుండటం విశేషం.


ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న నిహారిక, మళ్ళీ మేకప్ వేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా ప్రమోషన్లలో ఆమె మాట్లాడుతూ తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలంగా అనేక కథలు వింటున్నానని, అందులో కొన్ని స్క్రిప్ట్స్ తనకు బాగా నచ్చాయని చెప్పారు. అన్నీ కుదిరితే 2027లో మళ్ళీ హీరోయిన్‌గా వెండితెరపై కనిపించే అవకాశం ఉందని ఈ మెగా ముద్దుగుమ్మ వెల్లడించారు.



More Telugu News