పెళ్లిపీటలెక్కిన బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి... ఫొటోలు వైరల్!

'ఉయ్యాల జంపాల' సినిమాతో పరిచయమై, బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటి పునర్నవి భూపాలం ఓ ఇంటివారయ్యారు. తన ప్రియుడు హేమంత్ వర్మను ఆమె మార్చి 20న వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

పునర్నవి భూపాలం 'ఉయ్యాల జంపాల' చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి, తన సహజమైన నటనతో తొలి సినిమాలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు', 'పిట్టగోడ' వంటి పలు చిత్రాల్లో నటించినా, ఆమెకు ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు. అయితే, నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ఆమె కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది. ఈ షో ద్వారా పునర్నవి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరై, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

బిగ్ బాస్ తర్వాత వచ్చిన సినిమా అవకాశాలను పక్కనపెట్టి, ఉన్నత విద్యపై దృష్టి సారించారు పునర్నవి. లండన్‌లో సైకాలజీలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లారు. చదువు పూర్తయ్యాక ఇటీవలే తిరిగి వచ్చిన ఆమె, తన వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన హేమంత్ వర్మతో తన ప్రేమ విషయాన్ని గతేడాది అధికారికంగా ప్రకటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది.

తాజాగా మార్చి 20న ఎలాంటి హడావుడి లేకుండా హేమంత్ వర్మతో ఏడడుగులు నడిచారు. ఈ ప్రైవేట్ వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పునర్నవి వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో, భవిష్యత్తులో ఆమె తిరిగి సినిమాల్లోకి వస్తారా లేదా అన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ నూతన దంపతులకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు.


More Telugu News