సరిహద్దులు దాటుతున్న యూపీఐ.. ఇక భూటాన్‌తోనూ సులభతర లావాదేవీలు

భారత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలు సరిహద్దులకు ఆవల కూడా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో పొరుగుదేశమైన భూటాన్‌తో సరిహద్దు చెల్లింపుల కోసం భారత్ ఒక కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా ఇరు దేశాల మధ్య డబ్బు పంపడం మరింత చౌకగా, సులభంగా మారనుంది. పోస్టల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఈ నగదు బదిలీ ప్రక్రియను అమలు చేయనున్నారు.

ఈ మేరకు భారత పోస్టల్ శాఖ, భూటాన్ పోస్టల్ శాఖ మధ్య ఒక అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ (యూపీయూ) వారి 'పాస్‌ట్రాన్స్‌ఫర్' సిస్టమ్‌ను భారత్ యూపీఐతో అనుసంధానించడం ద్వారా ఈ సేవలను అందిస్తారు. ఈ చొరవతో ఇరు దేశాల పౌరులకు డిజిటల్ చెల్లింపు సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని, ఆర్థిక సంబంధాలు బలపడతాయని అధికారిక ప్రకటనలో తెలిపారు.

భూటాన్ అధికారులకు భారత్‌లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు
కేవలం నగదు బదిలీకే పరిమితం కాకుండా, పోస్టల్ కార్యకలాపాలు, టెక్నాలజీ అభివృద్ధి, శిక్షణ, లాజిస్టిక్స్, ఫిలాటెలీ (తపాలా బిళ్లల సేకరణ) వంటి పలు రంగాల్లో సహకరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా, భూటాన్ పోస్టల్ అధికారులకు భారత్‌లోని రఫీ అహ్మద్ కిద్వాయ్ నేషనల్ పోస్టల్ అకాడమీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

అంతేగాక‌ డిజిటల్ పోస్టల్ సిస్టమ్స్, డిజిటల్ అడ్రస్ కోడ్ వంటి అత్యాధునిక టెక్నాలజీల అనుభవాన్ని భూటాన్‌తో పంచుకోవడానికి భారత్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆర్థిక సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో పోస్టల్ నెట్‌వర్క్ పాత్రపై తమ అనుభవాన్ని పంచుకోవడానికి కూడా ముందుకొచ్చింది. ఫిలాటెలీ ప్రదర్శనలకు భూటాన్‌ను ఆహ్వానిస్తూ సాంస్కృతిక బంధాన్ని కూడా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు.


More Telugu News