పాక్ కోచ్‌గా చేదు అనుభవం.. తొలిసారి నోరు విప్పిన గ్యారీ కిర్‌స్టెన్

భారత్‌కు 2011లో వన్డే ప్రపంచకప్ అందించిన కోచ్ గ్యారీ కిర్‌స్టెన్, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పనితీరుపై సంచలన ఆరోపణలు చేశాడు. పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా తన కొద్దికాలపు అనుభవాన్ని వివరిస్తూ.. పీసీబీ నుంచి తాను ఊహించని స్థాయిలో జోక్యాన్ని ఎదుర్కొన్నానని, తన కెరీర్‌లో ఇంతటి జోక్యాన్ని ఎప్పుడూ చూడలేదని తొలిసారి నోరు విప్పాడు.

2024 ఏప్రిల్‌లో రెండేళ్ల కాంట్రాక్ట్‌పై పాకిస్థాన్ జట్టుకు హెడ్ కోచ్‌గా నియమితుడైన కిర్‌స్టెన్, కేవలం ఆరు నెలలకే అక్టోబర్‌లో తన పదవికి రాజీనామా చేశారు. ఆటగాళ్ల ఎంపిక విషయంలో మొహ్సిన్ నఖ్వీ నేతృత్వంలోని పీసీబీతో వచ్చిన విభేదాలే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా 'టాక్‌స్పోర్ట్ క్రికెట్' అనే మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామా వెనుక ఉన్న కారణాలను కిర్‌స్టెన్ బయటపెట్టాడు.

"నన్ను అన్నింటికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది బోర్డు జోక్యమే. ఆ స్థాయిలో జోక్యం ఉంటుందని నేను ఊహించలేదు. బయటి నుంచి నిరంతరం వినిపించే మాటలు, ఒత్తిడి మధ్య ఒక కోచ్ ఆటగాళ్లతో కలిసి పనిచేయడం చాలా కష్టం. జట్టు సరిగా రాణించనప్పుడు పేలవమైన ప్రదర్శనలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటివి జరిగాయి. జట్టు విఫలమైనప్పుడు నింద మోపడానికి కోచ్ సులువుగా దొరుకుతాడు. కోచ్‌ను తొలగించడం లేదా అతనిపై ఆంక్షలు పెట్టడం వంటివి చేస్తారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదు. అలాంటప్పుడు అసలు కోచ్‌ను ఎందుకు నియమించుకోవాలి?" అని కిర్‌స్టెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.

పాకిస్థాన్‌తో తన ప్రయాణాన్ని ముగించిన కిర్‌స్టెన్, ప్రస్తుతం శ్రీలంక జాతీయ జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2026 ఏప్రిల్ 15 నుంచి ఆయన రెండేళ్ల కాంట్రాక్ట్‌పై శ్రీలంక జట్టుతో పనిచేయనున్నాడు. ఈ ఒప్పందం 2028 ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ప్రధానంగా 2027లో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌ కోసం శ్రీలంక జట్టును సిద్ధం చేయడమే కిర్‌స్టెన్ ముందున్న లక్ష్యం. అంతకుముందు ఆయన నమీబియా క్రికెట్ జట్టుకు కన్సల్టెంట్‌గా కూడా సేవలందించాడు.

దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్‌గా సుదీర్ఘకాలం ఆడిన కిర్‌స్టెన్, టెస్టులు, వన్డేల్లో కలిపి 14,000 పైగా పరుగులు సాధించాడు. ఆ తర్వాత కోచ్‌గా మారి భారత్, దక్షిణాఫ్రికా వంటి జట్లకు విజయవంతంగా మార్గనిర్దేశం చేశాడు.


More Telugu News