అత్యాచార నిందితుడితో సంబంధాలు.. మహారాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రాజీనామా

మహారాష్ట్రలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన ఒక వివాదంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ రూపాలీ చకంకర్ తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచారం ఆరోపణలపై అరెస్టయిన జ్యోతిష్యుడు అశోక్ ఖరత్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ ఫొటోలు బయటకు రావడం ఈ పరిణామాలకు దారితీసింది. శుక్రవారం సాయంత్రం ఆమె తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రికి పంపారు.

అస‌లేం జ‌రిగిందంటే..! 
మర్చంట్ నేవీ రిటైర్డ్ అధికారి అయిన అశోక్ ఖరత్.. తనకు దైవశక్తులు ఉన్నాయని చెప్పుకుంటూ జ్యోతిష్యుడిగా స్థిరపడ్డాడు. పూజలు, క్రతువుల పేరుతో మహిళలను లోబరుచుకునేవాడని ఆరోపణలు ఉన్నాయి. 35 ఏళ్ల మహిళపై మూడేళ్లుగా పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నాసిక్‌లో బుధవారం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఖరత్ నుంచి ఒక పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకోగా, అందులో కొన్ని అభ్యంతరకర క్లిప్‌లతో సహా మొత్తం 58 వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో అశోక్ ఖరత్‌తో రూపాలీ చకంకర్ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఒక ఫొటోలో ఆమె ఖరత్‌కు గొడుగు పట్టుకుని ఉండటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి. శివసేన (UBT) నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ నాయకుడు విజయ్ వడెట్టివార్ వంటి వారు.. మహిళలకు న్యాయం చేయాల్సిన పదవిలో ఉండి అత్యాచార నిందితుడితో సంబంధాలు నెరపడంపై మండిపడ్డారు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

మొదట ఈ ఆరోపణలను ఖండించిన రూపాలీ, ఖరత్‌తో తనకు పరిమిత సంబంధాలే ఉన్నాయని చెప్పారు. అయితే, ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి తీవ్రం కావడంతో చివరికి వ్యక్తిగత కారణాలు చూపుతూ తన పదవికి రాజీనామా చేశారు.


More Telugu News