బెంగాల్ ఎన్నికలకు రికార్డు స్థాయిలో భద్రత.. ప్రతి దశలో 2,400 కంపెనీల బలగాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో రెండు దశల్లో జరగనున్న పోలింగ్ కోసం రికార్డు స్థాయిలో 2,400 కంపెనీల భద్రతా బలగాలను మోహరించనున్నట్లు శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఏప్రిల్ 23న తొలిదశ, ఏప్రిల్ 29న రెండో దశ పోలింగ్ జరగనుంది.

కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPF), ఇండియా రిజర్వ్ బెటాలియన్ (IRB), ఇతర రాష్ట్రాల సాయుధ పోలీసులతో కూడిన ఈ బలగాలను ప్రతి దశలోనూ మోహరిస్తారు. ఇప్పటికే ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా 480 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు బెంగాల్‌లో విధుల్లో ఉన్నాయి.

గతంలో 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగిన నేపథ్యంలో ఈసీ ఈసారి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పోలింగ్ ముగిసిన తర్వాత కూడా భద్రతను కొనసాగించాలని నిర్ణయించింది. ఈవీఎంలు, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రత కోసం 200 కంపెనీలు, శాంతిభద్రతల పరిరక్షణ, హింస నివారణ కోసం మరో 500 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు రాష్ట్రంలోనే ఉంటాయని స్పష్టం చేసింది.

పోలింగ్ ముగిసిన తర్వాత మిగిలిన 1,700 కంపెనీల బలగాలను వెనక్కి పంపిస్తారు. బలగాల కదలికలు, మోహరింపును సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సమన్వయం చేస్తుంది. సీఆర్పీఎఫ్ వెస్ట్ బెంగాల్ సెక్టార్ ఐజీ శలభ్ మాథుర్‌ను 'స్టేట్ ఫోర్స్ కోఆర్డినేటర్‌'గా ఈసీ నియమించింది. ఈ బలగాలకు అవసరమైన రవాణా, వసతి వంటి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News