ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన సరదా విజ్ఞప్తికి స్పందించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ యువరాజ్ దువా పోస్ట్ చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌ను ప్రధాని తన స్టోరీలో పంచుకున్నారు.

వివరాల్లోకి వెళితే, యువరాజ్ దువా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సరదా రీల్ చేశారు. తన తండ్రి ఎక్కువగా స్వీట్లు తింటున్నారని, ఆయనకు ఎంత చెప్పినా వినడం లేదని, కానీ ప్రధాని మోదీ మాటలకు ఆయన ఎంతో విలువిస్తారని పేర్కొన్నారు. "మోదీజీ, ఒక చిన్న విన్నపం. మీరు తదుపరి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో చక్కెర వాడకం గురించి మాట్లాడితే, మా నాన్న స్వీట్లు తినడం తగ్గించవచ్చు. మేం చెబితే మాత్రం జిలేబీలు తినడం మానడం లేదు" అని దువా ఆ వీడియోలో హాస్యభరితంగా కోరారు.

ఈ రీల్‌కు ప్రధాని మోదీ స్పందించారు. దువా రీల్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ, "నేను ఆయన తండ్రినే కాదు, ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. చక్కెర వాడకాన్ని తగ్గించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా జీవించండి!" అని సందేశం రాశారు. దీనితో పాటు, అధిక చక్కెర వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, ఊబకాయం ముప్పు గురించి వివరిస్తూ ఓ గ్రాఫిక్‌ను కూడా పంచుకున్నారు. ఫిట్‌గా ఉండేందుకు యోగా చేయాలని సూచించారు.

యువతకు సంబంధించిన అంశాలపై ఢిల్లీ కేంద్రంగా యువరాజ్ దువా చేసే కంటెంట్ సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం పొందింది. తాజాగా ప్రధాని మోదీ ఆయన విజ్ఞప్తికి స్పందించిన తీరు, ఆరోగ్య సందేశం ఇవ్వడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


More Telugu News