ఇండస్ట్రియల్ డీజిల్ ధరల మోత... లీటర్ పై ఏకంగా రూ.22 పెంపు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ ఇంధన ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధ వాతావరణం కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో, చమురు మార్కెటింగ్ కంపెనీలు ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా పరిశ్రమల్లో వాడే బల్క్ డీజిల్ (ఇండస్ట్రియల్ డీజిల్) ధరను లీటరుకు ఏకంగా రూ.22.03 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి.

శుక్రవారం నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. ఈ పెంపుతో లీటరు ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.87.57 నుంచి రూ.109.59కి చేరింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) కూడా తన ధరలను సవరించింది. 

సాధారణ వాహనాల్లో కాకుండా ఫ్యాక్టరీలు, షాపింగ్ మాల్స్, నిర్మాణ రంగంలోని భారీ యంత్రాలు, జనరేటర్లలో ఈ ఇండస్ట్రియల్ డీజిల్‌ను వినియోగిస్తారు. దీని ధర పెరగడం వల్ల పరిశ్రమల ఉత్పత్తి వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఈ భారం పరోక్షంగా రవాణా, ఇతర వ్యాపార కార్యకలాపాలపై పడి చివరికి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు, స్పీడ్, పవర్ వంటి ప్రీమియం పెట్రోల్ రకాల ధరలను కూడా లీటరుకు రూ.2.09 మేర పెంచారు.

ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు.


More Telugu News