అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కురుబలకోట మండల పరిధిలోని సర్కారుతోపు సమీపంలో నిన్న రాత్రి ఈ విషాద ఘటన జరిగింది. అతి వేగం, అజాగ్రత్త మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోటకు చెందిన సురేంద్ర, మదనపల్లికి చెందిన మాధవ, మహేశ్ అనే ముగ్గురు యువకులు స్నేహితులు. గురువారం రాత్రి పని నిమిత్తం మదనపల్లికి వచ్చి, తిరిగి తమ ఇళ్లకు బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో మదనపల్లి పట్టణ శివారులోని అమ్మచెరువుమిట్ట దాటిన తర్వాత జాతీయ రహదారిపై వీరి బైక్ అదుపుతప్పింది.

వేగంగా వెళ్లి రోడ్డు డివైడర్‌ను బలంగా ఢీకొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఒకే ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మరణించడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
 


More Telugu News