ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి

సమాజాన్ని పట్టిపీడిస్తున్న మూఢనమ్మకాలకు మరో నిండు ప్రాణం బలికాబోయింది. మానవత్వం సిగ్గుతో తలదించుకునేలా ఝార్ఖండ్‌లోని లాతేహార్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడిని 'మంత్రగాడు' అని ముద్రవేసి, గ్రామస్థులంతా కలిసి అతనితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ అమానవీయ చర్య, మన సమాజంలో ఇంకా ఎంత లోతుగా మూఢ విశ్వాసాలు పాతుకుపోయాయో స్పష్టం చేస్తోంది.

ఇటీవల గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మరణించింది. ఆమె మరణానికి వీరేంద్ర సింగ్ అనే వృద్ధుడి చేతబడే కారణమని గ్రామస్థులు గుడ్డిగా నమ్మారు. మంగళవారం సుమారు 15 మంది సమావేశమై, వీరేంద్ర సింగ్‌ను దోషిగా నిలబెట్టారు. అందరి ముందూ అతడిని మంత్రగాడంటూ నిందించి, బలవంతంగా మూత్రం తాగించి పైశాచిక ఆనందం పొందారు. బాధితుడి కుమారుడు బ్రజేష్ ముండా ఈ వివరాలను వెల్లడించారు.

గ్రామస్థుల అరాచకం అక్కడితో ఆగలేదు. వీరేంద్ర సింగ్ భార్యను కూడా అదే విధంగా అవమానించేందుకు ప్రయత్నించగా, కుమారుడు బ్రజేష్ అడ్డుకుని తల్లిని కాపాడాడు. ఈ ఘోరాన్ని ఆపేందుకు ప్రయత్నించిన కమ్యూనిటీ హెల్త్ వర్కర్ హీనా దేవి, ఆమె భర్తపై కూడా గ్రామస్థులు దాడి చేసి గ్రామం నుంచి వెళ్లగొట్టారు.

ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తొలుత స్పందన కరవైంది. అయితే, విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ విపిన్ కుమార్ దూబే విచారణకు ఆదేశించారు. ఈ ఉదంతంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) తీవ్రంగా స్పందించింది. సీఎంవో ఆదేశాలతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఈ దారుణానికి పాల్పడిన ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుని, మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం కింద కేసు నమోదు చేశారు. బాధితుడికి వైద్య సహాయంతో పాటు కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.


More Telugu News