'పరాభవ' నామ సంవత్సరం అంటే అవమానం కాదు... అసలు పరమార్థం ఇదే!

తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ ఉగాది. కాలానికి ఆదిగా భావించే ఈ పర్వదినంతో కొత్త తెలుగు సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏడాది, 2026 మార్చి 19వ తేదీ గురువారం నాడు శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆరంభం. ఇది తెలుగు పంచాంగంలోని 60 సంవత్సరాల చక్రంలో 40వది. అయితే ‘పరాభవం’ అనే పేరు వినగానే చాలామందిలో ఓటమి, అవమానం, అపజయం వంటి ప్రతికూల ఆలోచనలు తలెత్తుతున్నాయి. కానీ, జ్యోతిష్య, ఆధ్యాత్మిక శాస్త్రాల ప్రకారం ఈ పదానికి ఎంతో లోతైన, సానుకూల అర్థం ఉంది.

పరాభవం అంటే ఏమిటి? పండితుల విశ్లేషణ
సాధారణ వాడుకలో పరాభవం అంటే ఓటమి అని భావించినా, వేద పండితులు దీనికి విశిష్టమైన అర్థాన్ని వివరిస్తున్నారు. ‘పరాభవ’ అనే పదాన్ని ‘పరా + భవ’గా విడదీసి చూడాలి. ఇక్కడ ‘పరా’ అంటే సాక్షాత్తూ పరాశక్తి అయిన పార్వతీ దేవి అని, ‘భవ’ అంటే భవుడైన పరమశివుడు అని అర్థం. అంటే, ఈ సంవత్సరం పార్వతీ పరమేశ్వరుల సంయుక్త స్వరూపంగా, వారి అనుగ్రహం నిండిన కాలంగా భావించాలి. 

మరో ఆధ్యాత్మిక కోణంలో, ఇది మనలోని అహంకారం, గర్వం, స్వార్థం వంటి అంతర్గత శత్రువులను (అరిషడ్వర్గాలు) జయించే కాలాన్ని సూచిస్తుంది. గత తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మపరిశీలన ద్వారా వినయాన్ని అలవర్చుకుని ఉన్నత స్థితికి చేరడాన్నే నిజమైన ‘పరాభవం’గా పండితులు అభివర్ణిస్తున్నారు. ఇది మార్పుకు, పరిణామానికి, కొత్త శుభారంభాలకు సంకేతం.

60 ఏళ్ల చక్రంలో దీని స్థానం
తెలుగు సంవత్సరాలు మొత్తం 60. బృహస్పతి గ్రహం రాశి మార్పుల ఆధారంగా ఏర్పడిన ఈ కాలాన్ని మూడు భాగాలుగా విభజించారు. మొదటి 20 ఏళ్లు బ్రహ్మకు, 21 నుంచి 40 వరకు విష్ణువుకు, 41 నుంచి 60 వరకు శివుడికి అంకితం చేశారు. పరాభవ నామ సంవత్సరం విష్ణు విభాగానికి చెందిన చివరి సంవత్సరం. పురాణాల ప్రకారం, ఈ అరవై సంవత్సరాల పేర్లు నారద మహర్షి సంతానం లేదా దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని చెబుతారు.

ఈ ఏడాది చైత్ర శుక్ల పాడ్యమి తిథి మార్చి 19, ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై, మార్చి 20, ఉదయం 4:52 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ సమయంలో పాడ్యమి ఉండటంతో ఉగాది పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉగాది పచ్చడిలోని షడ్రుచులను స్వీకరించి, జీవితంలోని కష్టసుఖాలను సమంగా స్వీకరించాలనే సందేశాన్ని గ్రహించాలి. అహంకారాన్ని వీడి, దానధర్మాలు చేస్తూ వినయంతో ముందుకు సాగితే, ఈ పరాభవ నామ సంవత్సరం అందరికీ శుభాలను, విజయాలను అందిస్తుందని పండితులు భరోసా ఇస్తున్నారు.


More Telugu News