వైభవంగా 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025' పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మార్చి 19, గురువారం సాయంత్రం హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరై ప్రత్యేక శోభను తెచ్చారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన అర్ధాంగి సురేఖతో కలిసి హాజరుకాగా, కింగ్ నాగార్జున అమలతో విచ్చేశారు. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, నూతన దంపతులు నాగచైతన్య-శోభిత ధూళిపాళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథులుగా పాల్గొని, చిరంజీవితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

2025లో విడుదలైన చిత్రాలకు గాను పలు విభాగాల్లో అవార్డులు అందించారు. "తండేల్" చిత్రానికి గాను నాగచైతన్య ఉత్తమ నటుడిగా, "ది గర్ల్ ఫ్రెండ్" చిత్రానికి రష్మిక మందన్న ఉత్తమ నటిగా అవార్డులు అందుకున్నారు. "రాజు వెడ్స్ రాంబాయి" ఉత్తమ చిత్రంగా నిలవగా, అదే చిత్రానికి సాయిలు ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, కమల్ హాసన్‌కు పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు, అలనాటి నటి జయసుధకు ఏఎన్నార్ ఫిల్మ్ అవార్డు అందజేశారు. సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు వ్యాఖ్యానంతో సాగిన ఈ వేడుకలో నటి నిధి అగర్వాల్ డ్యాన్స్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్ డీసీ) ఆధ్వర్యంలో జరిగిన ఈ అవార్డుల కార్యక్రమం సినీ పరిశ్రమలో నూతనోత్సాహాన్ని నింపింది.


More Telugu News