యుద్ధాన్ని ముగిస్తాం.. ఎప్పుడు అనేది అంతిమ నిర్ణయం ట్రంప్‌దే: అమెరికా రక్షణ మంత్రి

ఇరాన్‌పై యుద్ధంలో అమెరికా ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగుతోందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ అన్నారు. అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే విషయం చెప్పలేమని అన్నారు. యుద్ధం ముగింపుపై కచ్చితమైన కాలపరిమితిని చెప్పేందుకు ఆయన నిరాకరించారు. యుద్ధం విషయంలో అంతిమ నిర్ణయం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌దే అన్నారు. యుద్ధం ముగింపునకు తాము కచ్చితమైన కాలపరిమితిని నిర్దేశించుకోలేదని తెలిపారు.

సౌదీ అరేబియాలోని అతిపెద్ద గ్యాస్ కేంద్రంపై ఇరాన్ దాడికి పాల్పడడంతో ఆగ్రహించిన అమెరికా తీవ్ర పరిణమాలు తప్పవని హెచ్చరించింది. ఇరాన్‌పై ఈ రోజు భారీ స్థయిలో దాడులకు పాల్పడుతామని, గల్ఫ్‌ యుద్ధాన్ని తమదైన స్టయిల్లో ముగిస్తామని పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. చనిపోయిన వారిని గౌరవిస్తామని, అనుకున్న పనిని పూర్తి చేస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ఆ తర్వాత యుద్ధాన్ని ముగిస్తామని అభిప్రాయపడ్డారు.

ఇరాన్‌పై యుద్ధానికి దిగిన మొదటి రోజు నుంచి తమ లక్ష్యంలో ఎలాంటి మార్పు లేదని ఆయన వెల్లడించారు. ఇరాన్‌ రక్షణ, క్షిపణి తయారీ కేంద్రాలను నాశనం చేశామని, కాబట్టి ఆ దేశం కొత్తగా బాలిస్టిక్ క్షిపణులను తయారు చేసుకోలేదని అన్నారు. అంతేకాదు ఇరాన్‌కు చెందిన 11 జలాంతర్గాములను ముంచివేసినట్లు తెలిపారు. ఏయే లక్ష్యాలతో ఇరాన్‌లో యుద్ధం ప్రారంభించామో అవన్నీ సాధించి, తాము అనుకున్న మిషన్‌ను పూర్తి చేస్తామని పీట్ హెగ్సెత్ అన్నారు.


More Telugu News