ప్రాణాలు దక్కించుకోవడానికి భార్యను ప్రియుడికే అప్పగించిన భర్త!

ఉత్తరప్రదేశ్‌లో ఒక వింతైన, భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా పెళ్లి అంటే నూరేళ్ల పంట అనుకుంటారు, కానీ ఇక్కడ రాజ్‌ కుమార్ అనే వ్యక్తికి తన భార్య ఫోన్లో కనిపించిన మూడు పదాలు మరణ శాసనంలా అనిపించాయి. 'సిమెంట్ మరియు డ్రమ్' ... ఈ పదాల వెనుక ఉన్న కిరాతక కోణాన్ని అర్థం చేసుకున్న ఆ భర్త, తన ప్రాణాలను కాపాడుకోవడానికి తన భార్యను ఆమె ప్రియుడితోనే పంపించేశాడు.


రాజ్‌కుమార్ భార్యకు గత కొంతకాలంగా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉంది. తరచుగా గొడవ పడుతూ, తన ఆరు నెలల బిడ్డను కూడా వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్ళిపోయేది. నిలదీసిన ప్రతిసారీ ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసేది. ఒకరోజు ఫోన్ ఆమె మాట్లాడుతుండగా రాజ్‌కుమార్ ఆ ఫోన్‌ను లాక్కున్నాడు. అందులో అతనికి కనిపించిన దృశ్యాలు మైండ్ బ్లాక్ చేశాయి.


ఫోన్ లో ఉన్న ఫేస్ బుక్ లో... హత్యలకు సంబంధించిన కథనాలు, వాటికి 'సిమెంట్ మరియు డ్రమ్' అనే క్యాప్షన్లు, నగ్న చిత్రాలు ఉన్నాయి. దీంతో, తనను అంతమొందించేందుకు వాళ్లు ప్లాన్ చేస్తున్నారని రాజ్ కుమార్ భావించాడు. రాజ్‌ కుమార్ ఇంతగా భయపడటానికి ఒక బలమైన కారణం ఉంది. సరిగ్గా ఏడాది క్రితం (2025 మార్చిలో), మీరట్‌లో ముస్కాన్ రస్తోగి అనే మహిళ తన ప్రియుడితో కలిసి భర్త సౌరభ్‌ను చంపి, బాడీని 15 ముక్కలు చేసి, ఒక నీలి రంగు డ్రమ్ములో పెట్టి సిమెంటుతో సీల్ చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన భార్య కూడా అదే ప్లాన్ వేస్తోందని రాజ్‌కుమార్ గ్రహించాడు.


బిడ్డను పట్టించుకోకుండా, వంట చేయకుండా, తనను, తన సోదరులను చంపేస్తానని బెదిరిస్తున్న భార్యతో వేగలేక రాజ్‌ కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. కౌన్సెలింగ్‌లో కూడా ఆమె తన ప్రియుడితోనే ఉంటానని తెగేసి చెప్పింది. దీంతో రాజ్‌కుమార్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రాణాలు కాపాడుకోవడానికి, ఆమెను తన కళ్లముందే ప్రియుడికి అప్పగించి పంపించేశాడు.


More Telugu News