నెగటివ్ రివ్యూలకు ముందే చెక్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' మేకర్స్ కొత్త వ్యూహం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్ కలయికలో వ‌చ్చిన‌ భారీ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’  విష‌యంలో విడుదలకు ముందే చిత్ర నిర్మాతలు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాపై నెగటివ్ ప్రచారానికి ఆస్కారం లేకుండా, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్‌మైషోలో రేటింగ్స్, రివ్యూల ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. 

ఇటీవల కాలంలో కొన్ని సినిమాలకు మొదటి షో కూడా పడకముందే, కొంతమంది ఉద్దేశపూర్వకంగా తక్కువ రేటింగ్స్ ఇస్తూ నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. సినిమా చూడకుండానే ఇలా చేయడం వల్ల ప్రేక్షకులు తప్పుడు అభిప్రాయానికి వచ్చే ప్రమాదం ఉందని, ఇది సినిమా ఓపెనింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ తరహా ‘రివ్యూ బాంబింగ్’ను అడ్డుకునేందుకే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రబృందం ఈ వ్యూహాన్ని అమలు చేసింది.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ విధానం కొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నిర్మాతలు తొలిసారి ఈ పద్ధతిని అవలంబించారు. ముందస్తు నెగటివ్ రేటింగ్‌లను నివారించేందుకు వారు కూడా బుక్‌మైషోలో రేటింగ్స్‌ను నిలిపివేశారు. ఇప్పుడు పవన్ వంటి స్టార్ హీరో సినిమాకు కూడా ఇదే విధానాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పవన్ కల్యాణ్ సినిమాకు ఉండే క్రేజ్, అంచనాల దృష్ట్యా, సినిమాపై పాజిటివ్‌గా ఎంత బజ్ ఉంటుందో, నెగటివ్‌గా కూడా ప్రచారం జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ప్రతికూల ప్రభావం సినిమాపై పడకుండా ఉండేందుకే నిర్మాతలు ఈ ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. సాధారణంగా ప్రేక్షకులు బుక్‌మైషో రేటింగ్స్ చూసి సినిమాకు వెళ్లాలా? వద్దా? అని నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో సినిమా చూసిన తర్వాత వచ్చే అసలైన ప్రేక్షకుల స్పందన (మౌత్ టాక్) మాత్రమే సినిమా భవిష్యత్తును నిర్ధారించనుంది. ఈ నిర్ణయంతో సినిమా వాస్తవ ఫలితం ప్రేక్షకుల తీర్పు ద్వారానే తేలుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News