మాట నిలబెట్టుకున్న బన్నీ.. అనాథ దివ్యాంగురాలి ఖాతాలో తొలి నెల సాయం జమ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా ప్రమాదంలో అనాథగా మారిన దివ్యాంగురాలికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. బాధితురాలు కడింపల్లి దుర్గకు జీవితాంతం అండగా ఉంటానని ప్రకటించిన ఆయన, తొలి నెలకు సంబంధించిన ఆర్థిక సాయాన్ని ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేశారు. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్న బన్నీపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల వేట్లపాలెంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం 23 మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మానసిక దివ్యాంగురాలైన దుర్గ తన తండ్రిని కోల్పోయింది. అంతకుముందే తల్లి అనారోగ్యంతో మరణించడంతో ఆమె పూర్తిగా అనాథగా మారింది. ఈ హృదయ విదారక విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ వెంటనే స్పందించారు. దుర్గ కనీస అవసరాల కోసం జీవితాంతం ప్రతినెలా రూ.7,500 చొప్పున అందిస్తానని భరోసా ఇచ్చారు. 

అన్నమాట ప్రకారం తాజాగా మొదటి నెల సాయం రూ.7,500 దుర్గ ఖాతాలో జమ కావడంతో, ఈ విషయాన్ని ఆమె తరఫు వ్యక్తి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అల్లు అర్జున్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు, అభిమానులు బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారని కొనియాడుతున్నారు. గతంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న నటి పావలా శ్యామలకు కూడా అల్లు అర్జున్ ఇలాగే నెలనెలా ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ ప్రతిష్ఠాత్మక చిత్రంలో నటిస్తున్నారు. దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ.800 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. దీంతో పాటు మరో సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్‌తో కూడా ఓ సినిమా చేసేందుకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. 


More Telugu News