యూట్యూబర్ వైష్ణవి హత్య కేసు.. భర్త అరెస్టు

జగిత్యాల జిల్లాకు చెందిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో ఆమె భర్త హరిబాబును పోలీసులు అరెస్టు చేశారు. వైష్ణవి హత్యకు సంబంధించిన వివరాలను కోరుట్ల సీఐ మీడియాకు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కోరుట్ల మండలంలోని మాదాపూర్‌కు చెందిన దుర్గాప్రసాద్, రాణి దంపతుల కుమార్తె వైష్ణవి. కొంతకాలంగా వైష్ణవి వీడియోలు తీస్తూ యూట్యూబ్ ద్వారా పేరు తెచ్చుకుంది.

కొద్దినెలల హరిబాబు అనే యువకుడితో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల పెద్దలకు కట్నం విషయంలో అంగీకారం కుదరలేదు. కట్నం ఇవ్వాలని హరిబాబు తల్లిదండ్రులు చెప్పగా, వైష్ణవి తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. కట్నం లేకుండా వివాహానికి అంగీకరించమని తల్లిదండ్రులు చెప్పడంతో హరిబాబు ఆత్మహత్యాయత్నం చేశాడు.

ఆ తర్వాత కోలుకున్న హరిబాబు, పెద్దలను కాదని గత సంవత్సరం మే 29న వెంకటాపూర్ గ్రామశివారులో వైష్ణవిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత నుంచి దంపతులు అత్తారింటిలో ఉంటున్నారు. ఆ తర్వాత హరిబాబు,  తల్లిదండ్రులు కట్నం గురించి అడుగుతుండటంతో వైష్ణవి తల్లిదండ్రులు రూ.5 లక్షలకు రెండు గుంటల భూమిని కొనుగోలు చేసి ఇచ్చారు.

గత కొన్నిరోజులుగా హరిబాబు అదనపు కట్నం కోసం వైష్ణవిని వేధింపులకు గురి చేశాడు. వైష్ణవి నాలుగు నెలల గర్భవతి. అయినప్పటికీ అత్తింటివారు కట్నం వేధింపులు ఆపలేదు. ఈ క్రమంలో నిన్న భర్త హరిబాబు భార్య వైష్ణవిని హత్య చేసి పరారయ్యాడు. వైష్ణవి విగతజీవిగా పడిఉండటంతో కోరుట్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు ధృవీకరించారు. వైష్ణవి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News