పవన్ డైలాగ్‌తో రాశీఖన్నా ప్రచారం.. వైరల్ అవుతున్న ‘ఉస్తాద్’ స్టైల్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. దర్శకుడు హరీశ్ శంకర్‌తో పవన్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఉగాది పండుగ కానుకగా ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడటంతో చిత్రయూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ముఖ్యంగా ఓ పవర్‌ఫుల్ డైలాగ్‌ను వాడుతూ చేస్తున్న ప్రచారం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

సినిమాలోని ‘ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం’ అనే డైలాగ్ విడుదలకు ముందే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇదే డైలాగ్‌ను ప్రచారానికి వాడుకుంటూ చిత్రబృందం సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ ప్రమోషన్లలో భాగంగా నటి రాశీఖన్నా ఓ వినూత్నమైన స్టైల్‌లో కనిపించారు. నలుపు రంగు షర్ట్ వెనుక ఈ డైలాగ్‌ను ప్రింట్ చేయించుకుని, ఆ షర్ట్‌తో ఆమె ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

గబ్బర్ సింగ్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఇందులో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా, రాశీఖన్నా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, ఎస్. థమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. సినిమాలో పార్థిబన్, గౌతమి, కేఎస్ రవికుమార్ వంటి ప్రముఖ నటులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


More Telugu News