రోహిత్ రెడ్డి డ్రగ్స్ పార్టీ కేసులో కీలక మలుపు... ముగ్గురిపై హత్యాయత్నం కేసు నమోదు

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్ డ్రగ్స్ కేసు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ వ్యవహారం కేవలం మాదకద్రవ్యాలకే పరిమితం కాకుండా, కాల్పుల ఘటనతో మరింత సీరియస్‌గా మారింది. పోలీసులు లోపలికి ప్రవేశించే సమయంలో నిందితులు కాల్పులు జరిపినట్లు తేలడంతో, పైలట్ రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీ వ్యాపారవేత్త నమిత్ శర్మలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.


మరోవైపు, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్ అధిష్ఠానం, పార్టీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ పైలట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేసింది. 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని, అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. సంతృప్తికరమైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరించే అవకాశం ఉందని హెచ్చరించింది.


కేసులో ఇతర ముఖ్యాంశాలు:

  • రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ సహా మొత్తం ఆరుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. వీరు కొకైన్, ఎండీఎంఏ తీసుకున్నట్లు సిట్ వెల్లడించింది.

  • ఎంపీ మహేశ్ కు స్టేషన్ బెయిల్ లభించగా... కాల్పుల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు.

  • డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు విచారణ కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సిట్ భావిస్తోంది.

  • టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కు కూడా టీడీపీ అధిష్ఠానం నోటీసు జారీ చేసి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. మొత్తానికి ఈ ఫాంహౌస్ ఉదంతం ఇరు పార్టీల నేతలకు తలనొప్పిగా మారింది.



More Telugu News