అక్షయపాత్ర ఫౌండేషన్‌కు మంత్రి లోకేశ్ అభినందనలు

అక్షయపాత్ర ఫౌండేషన్‌కు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. 25 ఏళ్లలో దేశవ్యాప్తంగా పాఠశాల విద్యార్థులకు 500 కోట్ల భోజనాలను అందించి అరుదైన ఘనత సాధించడంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ మహత్తర సేవకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం అందించే 'పీఎం పోషణ్' పథకం పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఫౌండేషన్ అందుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ స్పందిస్తూ... పిల్లల ఆకలి తీర్చి, పాఠశాలల్లో వారి హాజరును పెంచేందుకు అక్షయపాత్ర ఫౌండేషన్ చేస్తున్న కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ పురస్కారం ఫౌండేషన్ ఛైర్మన్ మధు పండిత్ దాస, వైస్ ఛైర్మన్ చంచలపతి దాస, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ రీజినల్ ప్రెసిడెంట్ వంశధార దాసతో పాటు యావత్ సిబ్బంది కృషికి లభించిన తగిన గుర్తింపు అని అన్నారు. ఫౌండేషన్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు.




More Telugu News