నటి శ్రీదేవి ఆస్తుల కేసు... బోనీ కపూర్, జాన్వీ, ఖుషీలకు కోర్టులో ఊరట

దివంగత నటి శ్రీదేవికి సంబంధించిన ఆస్తి వివాదంలో ఆమె కుటుంబానికి మద్రాస్ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న భూమికి సంబంధించి చెంగల్పట్టు కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. ఈ తాజా పరిణామంతో శ్రీదేవి భర్త, నిర్మాత బోనీ కపూర్, కుమార్తెలు జాన్వీ, ఖుషీ కపూర్‌లకు ఊరట దక్కినట్లయింది.

వివరాల్లోకి వెళితే, చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డులో ఉన్న 4.77 ఎకరాల భూమిని శ్రీదేవి 1988లో సంబంధ ముదలియార్ కుటుంబం నుంచి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఆ ఆస్తి శ్రీదేవి కుటుంబం ఆధీనంలోనే ఉంది. అయితే, చంద్రశేఖరన్ ముదలియార్ రెండో భార్య పిల్లలమని చెప్పుకుంటున్న నటరాజన్, శివగామి మరికొందరు, తాము చట్టబద్ధమైన వారసులమని పేర్కొంటూ ఆ ఆస్తిలో వాటా కోసం చెంగల్పట్టు అదనపు జిల్లా కోర్టులో దావా వేశారు.

ఈ దావాను కొట్టివేయాలని కోరుతూ బోనీ కపూర్ కుటుంబం మొదట చెంగల్పట్టు కోర్టును ఆశ్రయించింది. అయితే, పూర్తిస్థాయి విచారణ తర్వాతే యాజమాన్య హక్కులపై నిర్ణయం తీసుకోగలమని పేర్కొంటూ ఆ కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. దీంతో కపూర్ కుటుంబం మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రత్యర్థులు తప్పుడు పత్రాలతో 2005లో తాంబరం తహసీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ ధ్రువపత్రం పొందారని తమ పిటిషన్‌లో ఆరోపించారు. ముదలియార్ మొదటి భార్య జీవించి ఉండగానే రెండో వివాహం జరిగిందని చెబుతున్నారని, కాబట్టి వారి వారసత్వ వాదన చట్టబద్ధంగా చెల్లదని వాదించారు.

ఈ వాదనలు విన్న జస్టిస్ టీవీ తమిళ్‌సెల్వి, చెంగల్పట్టు కోర్టులో తదుపరి విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను మార్చి 26కి వాయిదా వేశారు. హైకోర్టు తాజా ఉత్తర్వులతో కింది కోర్టులో విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.


More Telugu News