తిరుమలలో బీఆర్ నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయి: భూమన కరుణాకర్ రెడ్డి
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన టీటీడీ చైర్మన్ పదవిలో బీఆర్ నాయుడు కొనసాగడం హిందూ సమాజానికే అవమానమని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుతం తిరుమల అరాచక శక్తులు, అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసాంఘిక శక్తులను ప్రోత్సహించడమే కాకుండా, సామాన్య భక్తులకు అందాల్సిన రూ.300 టికెట్లను కూడా తన అనుచరులకు, ఆకు రౌడీలకు కట్టబెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ అరాచకాలను ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలిపిన వైఎసీపీ మహిళా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించడం దారుణమని ధ్వజమెత్తారు. ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరియాల్సిన చోట, నాయుడి అనుచరుల బూతులు వినిపిస్తున్నాయని దుయ్యబట్టారు. బీఆర్ నాయుడికి సంబంధించి బయటకు వచ్చిన వీడియోల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ... అటువంటి వ్యక్తి చైర్మన్గా ఉండటం వల్ల టీటీడీ విశిష్టత దెబ్బతింటోందని, ప్రభుత్వం వెంటనే ఆయనను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అసాంఘిక శక్తులపై 50 ఏళ్ల క్రితమే పోరాటం చేసిన చరిత్ర తనదని చెప్పారు.