Nara Lokesh: తప్పు రిపీట్ అయితే కఠిన చర్యలు తీసుకుంటా: నారా లోకేశ్

Nara Lokesh Warns Strict Action on Midday Meal Issues
షార్ట్స్‌లో చూడండి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, తప్పు పునరావృతం అయినా కఠిన చర్యలు తప్పవని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. చిన్న సమస్య ఉన్నా వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ఈ పవిత్ర బాధ్యతను ప్రతి ఒక్కరూ గుర్తెరిగి నడుచుకోవాలని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని ఓ పాఠశాలలో ఇటీవల మధ్యాహ్న భోజనంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో ఆయన మంగళవారం ఆకస్మిక తనిఖీ చేపట్టారు.

మైలవరం దేవునిచెరువు తారకరామా నగర్ మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు వెళ్లిన మంత్రి లోకేశ్, విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా తిని నాణ్యతను పరిశీలించారు. 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. కొత్త కాంట్రాక్టర్ అందిస్తున్న భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. భోజనం బాగుందని విద్యార్థులు బదులిచ్చారు. వివాదం జరిగిన రోజు, అంతకుముందు భోజనం ఎలా ఉండేదని కూడా మంత్రి ఆరా తీశారు. భోజనంలో ఏమైనా సమస్యలుంటే ముందుగా తల్లిదండ్రులకు చెప్పాలని విద్యార్థులకు సూచించారు. ఇకపై భోజనం నాణ్యతపై 'లీప్' యాప్ ద్వారా తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకుంటామని, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యతను పరిశీలిస్తున్నారా అని సిబ్బందిని ప్రశ్నించారు.

అనంతరం అధికారులతో మాట్లాడిన మంత్రి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దని గట్టిగా హెచ్చరించారు. "మీపై పవిత్ర బాధ్యత ఉంది. విద్యార్థులకు సంబంధించి చిన్న సమస్య ఉన్నా తెలుసుకోవాలి, వెంటనే పరిష్కరించాలి. తప్పు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు" అని స్పష్టం చేశారు. భోజనం నాణ్యతపై ప్రతి వారం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తల్లిదండ్రుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలోని రికార్డులు, విద్యాబోధన తీరును పరిశీలించారు. ప్రతి పాఠశాల తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇటీవల మధ్యాహ్న భోజనంపై నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి గుర్తుచేశారు. సమూల మార్పుల కోసం రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామన్నారు. వారంలో ఒకరోజు స్థానిక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. 

Go Back to Shorts
Nara Lokesh
Midday Meal Scheme
Andhra Pradesh Education
School Food Quality
Centralized Kitchens
LEAP App
IVRS Feedback
Mylavaram
Government Schools
Student Learning

More Telugu News