విడుదలకు ముందే ఓవర్సీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వసూళ్ల మోత

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్‌ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు కేవలం రెండు రోజులే మిగిలి ఉంది. సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని అంటుతుండగా, విడుదలకు ముందు వస్తున్న అప్‌డేట్లు అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ చిత్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలకు ఇంకా సమయం ఉండగానే, అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఏకంగా 250K డాలర్ల (సుమారు రూ. 2.31 కోట్లు) మార్క్‌ను దాటేసింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ప్రీమియర్లతోనే భారీ వసూళ్లు ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

మరోవైపు దర్శకుడు హరీశ్‌ శంకర్ సినిమా ఫైనల్ అవుట్‌పుట్‌పై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ... "సినిమా ఫైనల్ వెర్షన్ చూశాను. చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు కావాల్సిన మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కచ్చితంగా లభిస్తుంది" అని ధీమా వ్యక్తం చేశారు. ఆయన మాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమాలో పవన్ మాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండగా, కీలక పాత్రల్లో పార్థిబన్, గౌతమి, రావు రమేశ్‌ వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు.

సినిమాకు సంగీతం మరో ప్రధాన బలంగా నిలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. దీనికి తోడు నేపథ్య సంగీతాన్ని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించడం విశేషం. ఆయన అందించిన పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్ సన్నివేశాలను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. అలాగే, సాధారణ ప్రేక్షకులకు కూడా అందుబాటులో ఉండేలా టికెట్ ధరలను నిర్ణయించడం సినిమాకు కలిసొచ్చే అంశంగా మారింది. ఈ నిర్ణయం వల్ల ఓపెనింగ్స్ మరింత భారీగా ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరుగుతున్న క్రేజ్, అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూస్తుంటే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.


More Telugu News