చైనాలో ధర్మవరం చేనేత వైభవం.. పట్టుచీర తయారీపై ప్రదర్శన

భారత చేనేత కళ, ముఖ్యంగా ధర్మవరం పట్టు వస్త్రాల ఖ్యాతి అంతర్జాతీయ వేదికపై మరోసారి ప్రకాశించింది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత డిజైనర్‌, జాతీయ అవార్డు గ్రహీత జూజురు నాగరాజు.. చైనా రాజధాని బీజింగ్‌లో పట్టుచీర తయారీ విధానాన్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించారు.

బీజింగ్‌లో జరిగిన ‘వసంత్‌ మేళా’ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగరాజు మన దేశం నుంచి ప్రత్యేకంగా తీసుకెళ్లిన చిన్న చేనేత మగ్గంపై అక్కడికక్కడే పట్టుచీరను నేసి చూపించారు. ఈ సందర్భంగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ విద్యార్థులకు, కళాశాల అధ్యాపకులకు, స్థానిక చైనీయులకు చేనేత వస్త్రాల తయారీలోని నైపుణ్యం, కళాత్మకత గురించి ఆయన వివరించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధర్మవరం పట్టు వస్త్రాలకు డిమాండ్‌ పెంచాలనే లక్ష్యంతోనే ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నాగరాజు తెలిపారు. భారత కేంద్ర ప్రభుత్వానికి చెందిన చేనేత సేవా కేంద్రం, హ్యాండ్‌లూమ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (హెచ్‌ఈపీసీ) సంయుక్త సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగిందని ఆయన వెల్లడించారు.


More Telugu News