ఎలాన్‌మస్క్ సంస్థ ఎక్స్ఏఐలో చేరిన అమన్ గొట్టుముక్కల

భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, స్టార్టప్ వ్యవస్థాపకుడు అమన్ గొట్టుముక్కల టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయనున్నారు. సాఫ్ట్‌వేర్ అభివృద్ధిని ఆటోమేట్ చేయడానికి రూపొందించిన ఆధునాతన ఏఐ (కృత్రిమ మేధ) వ్యవస్థలపై పనిచేయడానికి ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ సంస్థ 'ఎక్స్ఏఐ'లో చేరారు. అమన్ ఇటీవల తన బృందంతో కలిసి ఫైర్‌బెండర్ అనే ఏఐ కోడింగ్ అసిస్టెంట్‌ను ప్రారంభించారు. ప్రోగ్రామర్లు కోడ్‌ను మరింత సమర్థవంతంగా రాయడానికి ఇది సహాయపడుతుంది.

ఎక్స్ఏఐ అడ్వాన్స్ కోడింగ్ ఏఐ సిస్టమ్స్ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేందుకు తాను ఎలాన్ మస్క్‌కు చెందిన సంస్థలో చేరుతున్నానని అమన్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. ఆధునాతన కోడింగ్ ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఎక్స్ఏఐ సరైన వేదిక అని ఆయన అభిప్రాయపడ్డారు. సూపర్ ఇంటెలిజెన్స్‌ను అందుకోవడానికి తాను చేస్తున్న కృషికి అవసరమైన కంప్యూటింగ్ శక్తిని ఈ సంస్థ అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ కూడా అతనిని ఎక్స్ఏఐలోకి ఆహ్వానించారు.

ఏఐ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ఎక్స్ఏఐ మరియు స్పేస్ ఎక్స్‌తో కలిసి పనిచేస్తానని అమన్ గొట్టుముక్కల తెలిపారు. అమన్ గొట్టుముక్కల కుటుంబం దశాబ్దాల క్రితం భారత్ నుంచి అమెరికా వెళ్లింది. టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. ఫైర్‌బెండర్‌ను ప్రారంభించడానికి ముందు అమన్ పారాడిగ్మ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌‍గా పనిచేశారు.


More Telugu News