Gas Cylinder Theft: ఏపీలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ చోరీ!
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల ప్రభావం ఇప్పుడు సామాన్యుడి వంటింటిపై కూడా పడుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా ఉద్రిక్తతల వల్ల గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం, దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కొరతకు దారితీస్తోంది. గ్యాస్ సిలిండర్ల కోసం జనం గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి తలెత్తడంతో, అక్రమార్కులు దీనిని బ్లాక్ మార్కెట్ దందాకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఇదే సమయంలో కొందరు దొంగలు సైతం తమ రూటు మార్చి, ఏకంగా ఇళ్లలోని గ్యాస్ సిలిండర్లను టార్గెట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది.
ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఒక వింత దొంగతనం వెలుగుచూసింది. నిన్న అర్థరాత్రి సమయంలో దొంగలు ఒక ఇంట్లోకి చొరబడి, అక్కడున్న గ్యాస్ సిలిండర్ను ఎత్తుకెళ్లారు. బయటకు వెళ్లిన బాధితులు తిరిగి వచ్చి చూసేసరికి సిలిండర్ కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. చివరకు చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేయగా, ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, ద్వారకా తిరుమలలోని ప్రసిద్ధ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కూడా గ్యాస్ కొరత ఉన్నట్టుగా కనిపిస్తోంది. అన్నప్రసాద భవనంలో వంటల కోసం కట్టెల పొయ్యిలను సిద్ధం చేయాలని అధికారులు నిర్ణయించారు.