అది వ్యూహాత్మకమే.. తప్పేమీ లేదు: వివాదాస్పద రనౌట్‌పై బంగ్లా కెప్టెన్ మిరాజ్

ఢాకా వేదికగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య జరిగిన రెండో వన్డేలో స్కోరు కంటే ఒకే ఒక్క సంఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. క్రీడాస్ఫూర్తికి, నిబంధనలకు మధ్య ఉన్న గీతను చెరిపేస్తూ బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ చేసిన ఓ రనౌట్ పెను దుమారం రేపింది. ఈ ఘటనతో క్రీడాలోకంలో మరోసారి 'స్పిరిట్ ఆఫ్ క్రికెట్'పై వాడివేడి చర్చ మొదలైంది.

అస‌లేం జరిగిందంటే..!
పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 39వ ఓవర్ వేస్తున్నాడు మిరాజ్. ఆ సమయంలో క్రీజులో మహమ్మద్ రిజ్వాన్, నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో సల్మాన్ అలీ అఘా ఉన్నారు. రిజ్వాన్ ఆడిన బంతి నేరుగా బౌలర్ మిరాజ్ వైపు వచ్చింది. దాన్ని అతను కాలితో ఆపాడు. బంతిని తిరిగి బౌలర్‌కు ఇచ్చేందుకు నాన్-స్ట్రైకర్ అఘా క్రీజు దాటి ముందుకు వచ్చాడు. అయితే, అఘా బంతిని అందుకునేలోపే, మిరాజ్ వేగంగా దాన్ని తీసుకుని వికెట్లను గిరాటేశాడు. ఆ సమయంలో అఘా క్రీజు బయట ఉండటంతో థర్డ్ అంపైర్ అతన్ని ఔట్‌గా ప్రకటించాడు.

ఈ అనూహ్య పరిణామంతో అఘా తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కెప్టెన్ మిరాజ్, వికెట్ కీపర్ లిటన్ దాస్‌తో తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు. పెవిలియన్ వైపు వెళుతూ తన హెల్మెట్, గ్లోవ్స్‌ను కోపంగా విసిరేశాడు. అప్పటివరకు మంచి స్థితిలో ఉన్న పాకిస్థాన్, ఈ వికెట్ తర్వాత కుప్పకూలింది. కేవలం 43 పరుగుల వ్యవధిలోనే చివరి 7 వికెట్లను కోల్పోయింది.

వ్యూహాత్మకమే తప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదు: మిరాజ్
మ్యాచ్ అనంతరం ఈ వివాదంపై మిరాజ్ స్పందించాడు. తాను చేసింది వ్యూహంలో భాగమే తప్ప, క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదని స్పష్టం చేశాడు. "అతను క్రీజుకు దూరంగా ఉన్నాడు. ఒకవేళ బంతిని నేను మిస్ చేసి ఉంటే, వాళ్లు పరుగు కోసం ప్రయత్నించేవారేమో. అందుకే నేను అలా ఆలోచించాను. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అతని ఉద్దేశం ఏమిటో నేను ఊహించలేను" అని తన చర్యను సమర్థించుకున్నాడు. బ్యాటర్ ఏకాగ్రత కోల్పోవడాన్ని తాను అవకాశంగా మలుచుకున్నానని వివరించాడు.

ఈ మ్యాచ్‌లో పాక్‌ డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం 128 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను సమం చేసినప్పటికీ, ఈ రనౌట్ వివాదమే ప్రధానంగా నిలిచింది. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు మాజీ క్రికెటర్లు విమర్శిస్తుండగా, నిబంధనల ప్రకారం మిరాజ్ చేసింది సరైందేనని మరికొందరు వాదిస్తున్నారు. సిరీస్ నిర్ణయాత్మక చివరి మ్యాచ్‌పై ఈ ఘటన ప్రభావం కచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News