Pawan Kalyan: గిరిజనుల మధ్య జనసేన ఆవిర్భావ వేడుకలు.. పాడేరులో పవన్ పర్యటన

Pawan Kalyan Celebrates Janasena Formation Day with Tribals in Paderu
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గిరిజనుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో పవన్ పాడేరు నియోజకవర్గంలోని ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

తొలుత ఓనూరు జంక్షన్‌లో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కల్యాణ్, అక్కడి నుంచి కాలినడకన తన పర్యటన కొనసాగించారు. ప్రధానమంత్రి జన్ జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు సుమారు 2.4 కిలోమీటర్ల మేర నిర్మించిన కొత్త రహదారిపై నడుస్తూ, మార్గమధ్యంలో గిరిజనులతో ఆప్యాయంగా మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం 'అడవితల్లి బాట' కార్యక్రమంలో భాగంగా నిర్మించిన రోడ్లను పవన్ ప్రారంభించారు. పర్యటన ముగింపులో నందిగరువు గ్రామంలో గిరిజనులతో ప్రత్యేకంగా మాటామంతీ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి యోగక్షేమాలను విచారించి, వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ నేరుగా గిరిజనుల మధ్య పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Pawan Kalyan
Janasena
Paderu
Tribal Welfare
Andhra Pradesh Politics
Janajati Adivasi Nyaya Maha Abhiyan
MGNREGA
Road Development
AP Deputy CM
Tribal Communities

More Telugu News