పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ టైమ్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి కీలక అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ట్రైలర్‌ను ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగాయి.

పవన్ కెరీర్‌లో 'గబ్బర్ సింగ్' ఒక మైలురాయిగా నిలిచిపోయింది. వరుస ఫ్లాపుల తర్వాత వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు అదే దర్శకుడు హరీశ్‌ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్' వస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటమే ఈ హైప్‌కు ప్రధాన కారణం.

ట్రైలర్ విడుదలపై మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ‘గత్తర లేపేద్దాం’ అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపారు. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

ఉగాది పండుగ సందర్భంగా ఈ నెల‌ 19న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ట్రైలర్ విడుదలతో మేక‌ర్స్‌ సినిమా ప్రమోషన్లను వేగవంతం చేయనున్నారు.


More Telugu News